Wednesday, May 31, 2023

కర్పూర వసంత రాయలు కావ్యం పై ఇతర కావ్యాల ప్రభావం- విశ్లేషణ

 

-        డా. జాడ సీతాపతి రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, ట్రిబుల్ ఐటి,

నూజివీడు ప్రాంగణం, ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. 

విద్యుల్లేఖ: seethuphd@gmail.com ; సంచారవాణి: 9951171299

 

Key words: కర్పూర వసంత రాయలు- నృసింహ పురాణంలో వర్ణనల ప్రభావం- మానసిక స్థితులు- గంగానది గొప్పదాన్ని స్వీకరణ- పురాణాల నుంచి కొన్ని అంశాల స్వీకరణ- ఆరాధన తత్త్వం- విశ్లేషణ, విమర్శనాత్మకం

1. కావ్య నేపథ్యం

సాహిత్య సృజన ఆదర్శం, ఆనందం కోసం. కొత్తదనం దీనికి బీజం. ప్రాచీన కావ్యాల సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొని కొత్తదిగా మార్చినా పాఠకుడి మనసులో వాహ్వ్ అనే భావోదయం కలుగుతుంది.

క్రీస్తు శకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని కుమార గిరి రెడ్డి అనే రెడ్డి రాజు రాజ్యాన్ని పాలించాడు. 1957 ఇది ఒక కథాత్మక గేయకావ్యం-- క్రీస్తుశకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని అంధ్రదేశాన్ని పాలించిన ' రసికప్రభువు' -కుమారగిరి రెడ్డి. కుమారగిరి రెడ్డి ఆస్తాన నర్తకి 'లకుమ; ఈ లకుమా ప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరయలు. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి HISTORY OF REDDY'S KINGDOMS లో కుమారగిరి రెడ్డి కి కర్పురవసంతరయలు అన్న బిరుదు ఉన్నదని ఉదహరించారు. ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు 'కుమారగిరి'. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమ ద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట.  ఆ నేపథ్యంలో ఈ కావ్యానికి శ్రీకారం చుట్టారు సినారె. లకుమ ఒక కల్పిత పాత్ర. ఈమెను సజీవ చిత్రణ చేయడానికి పూనుకున్నారు.

2. కథలోకి వెళ్తే:

కర్పూరవసంత రాయలు ఒక రెడ్డి రాజు. పాలనా దక్షుడు, సంగీత నృత్యాలంటే చెవికోసుకుంటాడు. అది పిచ్చిగా మారితే ప్రమాదమేగా. ఈ భావనల్ని తీసుకున్న సి. నారాయణ రెడ్డిగారు కొంత చరిత్రను, కొంత సృజనను కలిపిన వసంత కర్పూర పరిమళం ఈ కర్పూర వసంత రాయలు.

3. పాత్ర స్వభావం: లకుమ అందగత్తె, ఆపై నాట్యపు జాణ. వసంత రాయల హృదయపు వీణగా మారింది. రాజు తలచుకుంటే వైభవానికి కొరతా?, ఆదరణకు ఆలోచనా? కవికి ఉన్న నృత్యాభివేశం, నాట్య౦లో గ్రహించిన విశేషాలు మరింత పాకాన పెట్టాయి. అది విచిత్ర మలపులతో, వలపులతో లకుమను చుట్టాయి. వెరసి ఆమె నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లు చేశాయి.

4. కథలో సంఘటనలు: ఇతర కావ్య ప్రభావాలు: 

            వసంత రాయలు లకుమను తీసుకొని అహోబలక్షేత్రం వెళ్ళాడు. స్వామిని దర్శించుకున్నాడు. దీన్ని కవి అందంగా కవిత్వీకరించాడు. దీన్ని ఒక సన్నివేశంగా మలిచాడు. సాయంకాలానికి వసంతేశుల ప్రయాణం. ఆ రాత్రి నిద్ర, ఉదయాన్నే లేచి స్వామి దర్శనం. పూదోటలో పూలు కోసి స్వామి పూజకు ఏర్పాట్లు. రాయలు నరసింహ స్వామి స్తుతి, పూజ ఇంకొకటి. అహోబల స్వామిని దర్శించారన్న ఒక్క విషయాన్ని ఇన్ని విభాగాలుగా చేసి కవి చేశాడ౦టే కవి ప్రతిభా విశేషాలు ఇందులో కనిపిస్తున్నాయి.

            ఇలాంటి వర్ణనకు దగ్గరిగా ఎఱ్ఱన నృసింహ పురాణంలో అహోబిలస్వామి వర్ణన కనిపిస్తుంది. అది  విష్ణువు నరసింహ అవతార౦గా ఆవిర్భవించి హిరణ్యకశిపుణ్ణి ఎత్తుకొని వెళ్ళి అహోబిల పర్వతం మీదకెగిరి అక్కడ చంపుతాడు. ఈ కథ ఐదో ఆశ్వాసంలో ఉంది. దీన్ని సినారె లకుమ వసంత రాయల వర్ణనలో కొంత వాడుకున్నాడు. లకుమా వసంతేశులు స్వామి దర్శనార్థం అహోబిలం చేరుకున్నారు.  అక్కడ భవనాశిని అనే నదిలో స్నానం. లక్ష్మీవనంలో పూలను కోయడం.

భవనాశినీధునీ పావనపయ స్నాత/ములు ప్రభాతాలసానిలపోతములు వీచె.

సుఖనిద్రనున్న రాజునకు ప్రాతస్సమీ/రములు వైతాళికత్వమును నిర్వర్తించె.

            భవనాశినిలో ఉదయం వేళ గాలి స్నానం చేసి వచ్చింది. నిద్రలో ఉన్న రాజుకు మెలకువ వచ్చింది. ఆ గాలికి కవి వైతాళికత్వాన్ని ఆరోపం చేస్తున్నాడు. దీనివల్ల అలంకారంతో పాటు కవితా సౌందర్యం కనబడుతుంది.

నుత లక్ష్మీవన పుష్ప సౌరభములు న్సొంపారి లోలోర్మి సం...... గావించె నాహ్లాదమున్(నృసి౦హ. 5-129)

            ఈ పద్యంలో లక్ష్మీవన పుష్ప సౌరభాలతో గాలి వచ్చింది. ఆపై మృదువుగా వీచింది. ఈ పద్యంలో మంద పవనుడు, ప్రభాతాలసానిలపోతములుగా మారిపోయాడు. అక్కడి దేవతాద్విజకోటి, వసంత రాయలుగా కవి మార్చుకున్నాడు. వసంత రాయలను మేల్కొల్పడానికి వైతాళికులు లేరు. కానీ కవి రాచమర్యాదలకు భంగం కలగకుండా కల్పించాడు.

5. లకుమ పరిస్థితి చూస్తే:

నిదుర మునిగిన లకుమ నీలాలకలతోడ/కోడెగాడుపులు దాగుడుమూతలాడుకొనె' కోడె గాలుపులు దాగుడు మూతలు లాంటి పదాలు ఏదో జరుగుతుందని కవి ఉత్కంఠను లేపుతున్నాడు.

ఇరుదెస నబ్ధి నాథుడు.... రచ్చటన్(5-135)

            ఈ పద్యంలో విష్ణువు ఒడిలో స్థిర నివాసం ఉన్న అందమైన తీగలలాంటి లక్ష్మీదేవి కేశపాశాలకు కొత్త నృత్య విలాసాలను వాయుదేవుడు కల్గిస్తున్నాడు అని చెప్పాడు. లక్ష్మీదేవి స్థానంలో లకుమాదేవి. మృదుల మారుత లీలన్, కోడెగడుపుగా మార్చాడు. శ్రీకర కుంతల భార చారు వల్లరులు అనే ప్రయోగం నీలాలక గా మార్చు కున్నాడు. నూత్న నర్తన విలాసము అనే ప్రయోగం దాగుడు మూతలుగా. ఎఱ్ఱన గాలి సోమరిగా, పైగా అతడు పిల్లవాడే. సినారె కోడెతనాన్ని చూపాడు. అప్పటికి కవికి కూడా కోడె వయసేగా. రాజు బలవంతుడు, తన ప్రతాపం సాగదు. అందుకని సోమరి పిల్లాడుగానే ఉన్నాడు. లకుమకు బలం లేదు. ఈమెను చూడగానే వాడికి ఎక్కడ లేని బలం వచ్చింది. మనుషుల ప్రతాపం అంతా బలహీనులమీదే. అధికారులు కూడా మనుషులే. కానీ బలమైన వారిముందు వారి అధికారం చెల్లదు కదా.... అనే లోకం తీరును చూపాడు.

6. నరసింహ స్వామి వర్ణన: గంగానది మాహాత్మ్యం

"శ్రీ కమనీయమూర్తి నరసింహ పదాంబుజ సేవగోరి మ౦.... మహోత్సవంబుతోన్"(5-122)

అందమైన రూపంతో ఉన్న నరసింహస్వామి పదపద్మాలను సేవించాలని గంగానది చాలా కెరటాలతో మత్తెక్కిన తుమ్మెదలతో మనోహరమైన పద్మలతో, చల్లని నీటిబిందువులతో మనోహరంగా ప్రకాశించే మహోత్సవంతో తన సహజమైన శరీర విలాసంతో ఈ భువికి దిగి వచ్చిందని ఎఱ్ఱన వర్ణించాడు.

అహోబలుని చరణసేవకై దివి/నవతరిలిన మందాకినిలో. ఇందులో ఉరుకులు పరుగులు నేటి మందాకినీలో లేవు.

“భవరోగంబుల కౌషధంబు భవ పాపజ్వాలకున్ వైరి దు

ర్భవ పంక ప్రవిశోధనంబు బవ భావస్ఫార తృష్ణాహరం

భవనాశిని భవనాశిని

భవనాశిని యనుచు... గలదే"(5- 151) ఈ చిన్న కంద పద్యంలో మూడు సార్లు ప్రశంసించడం జన్మ రాహిత్యానికి సూచన. కవులు కవిత్వ ఫలం ఇదేగా...

“నా కరుణారసంబు భవనాశిని నాన వినాశ... భవ్యతన్”(5-152 ) నా కరుణా రసమే ఈ భావ నాశిని నదిగా నాశం లేని ఆకృతిని పొందింది. ఇది స్వర్గ, మర్త్య, నాగలోకాలన్నిటిని పవిత్రం చేసే నీటిని కలిగి ఉంది. అందువల్లే ప్రశంసలు పొందింది. లోకాతిశయమైన చూపులకు సాఫల్యాన్ని కూర్చే పావనత్వం, మహత్వంతో ప్రకాశిస్తుంది అని చెప్పడం ఎఱ్ఱన పురాణం. భవనాశిని వర్ణన. డెబ్భై పై బడిన ఇక్కడి పదాలు సి నా రె గారి కలంలో పది పది పన్నెండు పదాలకు తీసుకువచ్చారు.

"భవభయ పాప జ్వాలాహారులు/భవనాశినిలో పారెడు నీరులు.

భవరుక్పీడిత జనౌషధమ్ములు /భవనాశినిలో పయఃపథమ్ములు".

భవ అనేపడం నాలుగు పదాల్లోనూ కవి ప్రయోగించాడు. హారులు, నీరులు; జనౌషధమ్ములు, పథమ్ములు అనే మూడు నాలుగు అక్షరాలతో అంత్యప్రాసను వాడాడు. నీటి ఉధృతితో పాటు, పైకి కిందకి వచ్చే కెరటాల పౌనః పున్యానికి శబ్దసూచిక.  

7. పురాణపు సౌరభం:

          ఎఱ్ఱన స్థల పురాణ౦ చెప్పడం ప్రధానం. కర్పూర వసంత రాయలులో భవనాశినిలో స్నానం చేసి, స్వామిని దర్శించుకొని, నాట్యం చేస్తుంటే చూడాలి. అంటే ఎఱ్ఱనగారికి ఈ నదీ జలాలు కేవలం ప్రాప పరిహరణ. కర్పూర వసంత రాయలకు చాలా పనులు. 

            లకుమతో కూడి రాయలు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి పెద్ద పెద్ద గోళ్ళు. అవి వజ్రాయుధంలా వాడిగా, కఠినంగా, తళతళ మెరుస్తూ ఉన్నాయి. ఏ ఆయుధం చేతా చావకూడదని బ్రహ్మనుంచి వరం పొందాడు కదా హిరణ్యకశిపుడు.

అలఘు తరాట్టహాసము లజాండ కటాహము వ్రయ్య భీషణో

జ్జ్వల వికట స్ఫురత్కులిశశాత నఖాంకుర తీవ్ర పాతనం

బుల నసురేంద్రుడు పేరురము బొల్పఱ జించి కలంచి శోణితం

బులు దొరగించె ద్రు౦చె బ్రోవులుగా బలుబ్రేవులుక్కునన్( 5-99) హిరణ్య కశిపుడిని తన ఒడిలో ఉంచి నృసింహ స్వామి పెద్ద పెద్ద అట్టహాసలతో బ్రహ్మాండమనే పాత్రను ముక్కలు చేయగా, భయంకరమైన, ప్రకాశవంతమైన వజ్రాయుధంలా వాడిగా ఉన్న తన నఖాగ్రలతో బాగా గిచ్చడంవల్ల రాక్షసరాజు ఉన్నత వక్షాన్ని అందం చెడేటట్లు చీల్చి, కల్లోల పరిచి, రక్తం పారించాడు. చాలా ప్రేవుల్ని ముక్కలుగా చేశాడని ఎఱ్ఱన వర్ణన.

దీన్ని సారాన్ని సూటిగా సినారె తన కవిత్వంలో చూపారు: ఒక్కదెస హిరణ్యకశిపు/డొక్కను జీల్చిన పవిధా

రానిశాతనిష్ఠుర నఖ/ రమ్ములు మిరుమిట్లు గొల్ప.  కేవలం గోర్లే ఆయుధం కానీ ఆయుధం అవడం వల్ల అదే ప్రధానం. దాన్ని ఇక్కడ తీసుకున్నారని గ్రహించవచ్చు.

అంతేకాదు, “శితనారసింహ నఖరా/ హత దైత్య  మహిప సూపహారంబున ద/ ర్పిత యయ్యే ననగ బరిశా౦/

తతనొందె ద్రిలోక పీడ తత్కర్షణ మాత్రన్ ( 5- 106) నరసింహ స్వామికి ఉన్న వాడిగోర్లతో చంపి, రాక్షస రాజుకి కానుకతో తృప్తి పరచినట్లు ఉన్నదని, ఒక్క క్షణ కాలంలోనే ముల్లోకాల పీడను విరగడ చేశాడని ఎఱ్ఱన వర్ణన.

సినారె మాత్రం వసంత రాయలు స్తుతించి, అక్కడ ఉన్న వారంతా పొగడుతుండగా దేవతలు అహో! బలా, అని పొగిడారట.“మీరు మదీయ బలం బహోబల శబ్ద పూర్వకంబుగా ప్రశంసించితిరి గావున నీ తీర్ధం బహోబల నామధేయంబున ద్రిభువన పావనంబై వెలయుంగాత” అని ఎఱ్ఱన చెప్పాడు.

సినారె: ఆమ్నాయమ్ములు నాలుగు /సాకృతులై నీ గుణమ్ము/ లాలపించ ఈ గిరి వే/ దాద్రిగ పేరొందెనంట అని చెప్పారు.

ఎఱ్ఱన నృసింహ పూరణంలో నృసింహస్వామిని స్తుతిస్తూ దండకాన్ని(5-109) రెండు పుటలు రాశాడు. ఇక్కడ సినారె మాత్రా ఛందస్సును వాడుతూ గేయ స్తుతి చేశాడు.

            అసలు నరసింహ స్వామిని కొలవడంలో ముఖ్యంగా: నరసింహ స్వామికి దేవతలందరకు ఇక్కడకు వచ్చి నన్ను భక్తితో ప్రతిరోజూ కొలిస్తే వారి సుఖ సంతోషాలు ఇస్తాననడం. రెండోది వసంతోత్సవం స్వామికి, రాయడికి ఇష్టం.

8. పూజలు పునస్కారాలు:

            లకుమ స్వామిని స్తుతించింది. లక్ష్మీదేవి ప్రత్యేకంగా: “ధృతి శాంతియు దృష్టియు స/న్మతి యను నెచ్చెలులతోడ/వేదవేద్యు అంకపీఠి/ వెలసిన లక్ష్మిని భజించె”. లక్ష్మీదేవి నరసింహ స్వామిలో చేరటానికి సమీపంలో ఉన్న పూదోట నుంచి వచ్చింది. అందుకే ఆ తోటకు లక్ష్మీవనం అని దేవతలు, స్వామి పేరు పెట్టారు. అందులో లకుమ కూడా అక్కడనుంచే వచ్చిందట.

శాంతియు దుష్టియున్ ధృతియు సన్మతియున్ మొదలైన నెచ్చలుల్

సంతత భక్తి  దంన్గొలువ సంయమి దేవ గణంబు లద్భుతా

శ్రాంత కుతూహల స్ఫురణ గన్గొనుచుండగా నట్లు వచ్చి శ్రీ

కాంత ముకుండు నంకతాటి గైకొని యెన్ స విలాస ఖేలతన్” (5-125)లోకైక మాత శ్రీ మహాలక్ష్మి శాంతి, తుష్టి, ధృతి, సన్మతి మొదలైన ముఖ్య చెలికత్తెలతో భక్తితో తన్ను సేవిస్తుండగా, ముని, దేవతాగణాలు ఆశ్చర్యంతో నిండిన కుతూహలంతో బుద్ధితో చూస్తుండగా, స విలాసంగా శ్రీ మహావిష్ణువు ఒడిలోకి చేరింది.

“పుండరీకపత్ర జైత్ర/ ములు స్వామి ప్రసన్ననేత్ర/ ములలో అమృతంపునవ్వు/ మొక్కలు చూచెను రాయడని” లకుమ నాట్యం తర్వాత కూడా రాజు లకుమ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇద్దరూ ఒరసి పట్టుకొని ఉన్నారని అమృతంపు నవ్వు మొలకలు చూసినట్లు సినారె పేర్కొన్నారు.  ఇది ఆమె శాశ్వత కీర్తికి సూచన.

9. ఎఱ్ఱన వర్ణనలు- సినారె  సొంపు

సిత కమల దళంబులకున్/బ్రతియగు లోచనము లందు బ్రబల ప్రసాద

స్మిత రుచి జాలములు దిశా /ప్రతతిన్ బూర్ణేందు రుచుల భంగి వెలి౦గెన్(5-114) తెల్లని పద్మాల రేకులకు సమానమైన అతని కన్నులలో ప్రసన్నతతో కూడిన చిరునవ్వుల కాంతులు విస్తరించాయి. అవి దిక్కుల సమూహాన్ని పున్నమి చంద్రుడి కాంతుల్లా ప్రకాశిస్తున్నాయి అని ఎఱ్ఱన వర్ణన.

ఇందులో అమృతపు నవ్వు మొక్కగా, సిత కమలం, పుండరీకంగా కవి దర్శించారు.

కోఱలు గీటుచు న్నయన కోణములం దహన స్ఫులింగముల్

గాఱగ గార్నముల్ బిగియగా ఘన కేసరముల్ విదుర్చుచున్

మీఱిన యుబ్బునన్ బొదలి  మీదికి మూరెడు పేర్చి కింక దై

వాఱగ బట్టె బిట్టు దితి పట్టి నృసింహు డసహ్య తీవ్రతన్ (5- 95) స్వామి కోఱలుగీటుచు, కళ్ల చిరవనుంచి నిప్పురవ్వలు విడుస్తూ, చెవులు నిశ్చయంగా దట్టమైన పొడవైన కేసరాలు విదులిస్తూ హద్దుమీరిన ఉత్సాహంతో ముందరికి మూరెడు వ్యాపించగా కోపం పెరిగి సహింప శక్త్య౦గా వేగంతో హిరణ్య కశిపుణ్ణి గట్టిగా పట్టుకొన్నాడు. ఇలాంటి చూడడానికి భయంకరమైన ఆ రూపాన్ని కవిగారు లకుమకు తెచ్చి చూపించాడు.

సంధ్యాశోణములు హరి/స్వామినయనకోణములం/దున హిరణ్యకశిపుని నె/త్తురుచారలు చూచె లకుమ.

కేసరములు పటపట నూ/గించుచు గర్చించు క్రుద్ధ/కంఠీరవమూర్తి చూచి/ కంపితయైపోయె లకుమ”.

 నయన కోణం అనే పదాన్ని సినారె వాడుకున్నారు. దహన స్ఫురిలింగము అనే పదాన్ని నెత్తురు చారలుగా  మార్చారు. ఎర్రదనం ఎఱ్ఱన ప్రయోగం తీసుకున్నాడు. కోరలు గీటుచు, కర్ణముల్ బిగియగా, మీఱిన యుబ్బునన్ బొదలి మీదికి మూరెడు పేర్చి ఇన్నిటిని కలిపి ఒక్క  క్రుద్ధ కంఠీరవమూర్తిగా సినారె మార్చాడు. ఈ దెబ్బకు లకుమ రాజు గారి భుజం మీద వాలింది.

10. భీమేశ్వర పురాణం - బసవ పురాణం

            భీమేశ్వర పురాణంలో భీమేశ్వరుడు దక్షారామ వాటికలోకి ప్రవేశిస్తున్నప్పుడు దేవతలంతా ఒకదగ్గరికి వచ్చారట. అది వసంత కాలం. వసంతోత్సవ కేళికి భీమనాథుడే ఆజ్ఞ ఇచ్చినట్లు

            ఆజ్ఞ వాటి౦చె గెలీ విహారములకు / భీమనాథు౦డు  దేవతాగ్రామణులకు

            గంధ కర్పూర కస్తూరికా ప్రశస్త/వస్తుకోటులు నొసగె నవారితముగ

            ఈ భీమనాథుడి స్థానం కర్పూర వసంత రాయల స్థానం అయింది.  అక్కడి దేవతలు ఇక్కడ ప్రజలు. గంధ కర్పూరాదులను భీమనాథుడు దేవతలకిస్తే ఈ వసంతరాయలు తాను ప్రజల మీద చల్లుతున్నాడు. ప్రజలు సంతోషం కోసం.

“తనతోడ నడచువా/ రిని జూచి, అల్లన శి /రము నూచి, మందహా /సము చేసి, నిండు దో

సిళ్లతో మృగమద/శ్రీ చందనరజమ్ము /కుండికలతో అచ్చ/గొజ్జంగి నీరమ్ము

కుమ్మరించె వసంతనృపుడు/కుసుమించె జనచిత్త మపుడు”.  

            భీమేశ్వరుని స్థానాన్ని వసంత రాయలకు కల్పించడం వల్ల గొప్పతనాన్ని పెంచినట్లయింది. రాయలు ఈ భీమేశ్వరుడి భక్తులు. శివభక్తులు శివుడితో సమానమంటాడు. పాల్కురికి సోమన బసవ పురాణంలోది ఈ సంఘటన.  

అచ్యుతుమీద జల్లే దుగ్ధాబ్ధి కన్య/ భారతీదేవి పద్మజు పైని జల్లె

శచి మహేంద్రుని జల్లెవాసంత కేలి/ గంధ కర్పూర కస్తూరికా జలంబు

 అచ్యుతుడు, లక్ష్మి; సరస్వతి బ్రహ్మ, శచీ ఇంద్రులు ఒకరిపై ఒకరు జల్లుకున్నారు అనే మాటల్ని అని వరుస అయిన వారిమీద “వరుస గలిసినవారు /కనుల కాశ్మీర ధూ /ళిని గొట్టి నగినారుఅని సినారె వర్ణించి చూపరులను, పాఠకులను నవ్వించారు.

“చెవిలోన బాఱంగ జిమ్మె గొజ్జగనీట/ గాల భైరవు నొక్క కలువక౦టి” ఇందులో అంత వరస వాయి లేవు. సినారె కర్పూర వసంత రాయలు లో జాగ్రత్తగా పదాల్ని వాడాడు: ప్రౌఢాంగనలు కొత్త/కోడెకాండ్రను దరిసి /చెవులలో పన్నీరు/ చిలికి పర్విడినారు”. ప్రౌఢాంగన అయితే కొత్త కోడెకాండ్రను సమీపించి పన్నీరు జల్లుతారు. ఆ కాలువక౦టిని సినారె ప్రౌఢా౦గన గా మార్చుకున్నారు. ఇది ఔచిత్యం కూడా. దేవతలే పరిమళ జలాలు జల్లుకోవడం చూసి తన్ను తను మరిచిపోయాడు.

11. ఛందో వైవిధ్యం:

            మాత్రా ఛందస్సు విషయంలో మొదటిది నాగార్జున సాగరం. రెండోది కర్పూర వసంత రాయలు. దీనిలో ఖండగతిని కొద్దిగా వాడుతూ, త్ర్యస్ర గతి, మిశ్ర, చతురస్ర గతుల్ని విశేషంగా వాడారు. ఒక రకమైన గతిలో కొన్ని చోట్ల మాత్రల్ని పెంచి, కొన్ని చోట్ల తగ్గించారు. వెంట వెంటనే గతుల్ని కూడా మార్చారు. ఛందో వైవిధ్యం, గతి వైచిత్రి పాఠకుడికి కొత్త ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ప్రతీ చరణంలో యతి, ప్రాస లకు బదులుగా అంత్య నియమాలు వాడారు.

12. సింహావలోకనం:

కవిత్వ శక్తికి అధ్యయనం ఒక అవసరం. ప్రతిభకు ఇది పట్టం గడుతుంది. కవనం ధారగా సాగడానికి ఛందస్సు బాటగా నిలుస్తుంది. చరిత్ర, ఊహ, ఆశ్చర్యం, ఆనందం, అద్భుతంతో కలిసిన ఆత్మత్యాగం దేశరక్షణలో భాగంగా వ్యక్తి స్వేచ్చకంటే గొప్పదిగా అన్వేషించారు.  లకుమ వాస్తవాన్ని గుర్తించింది. తన వ్యక్తి గత జీవితం కంటే  దేశానికి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన విరాగిగా ఆత్మత్యాగిగా వెలిగింది. అందుకే ఇప్పటికీ అక్కడ కస్తూరి సౌరభమే అనడం కవికి ఆ పాత్ర పట్ల ఆదరణకు అనురక్తికి చిహ్నం. పరమ సాధ్వీగా లకుమ రక్తంతో కూడిన  ప్రాణం  అంత్యంత అదరణతో ప్రేమించిన వసంతరాయల జీవితం కొండవీటి మట్టిలో కర్పూర సౌరభమై పంచ భూతాత్మకంగా నిలిచి౦ది.

ఆధారాలు:

ఆచార్య భూమయ్య, అనుమా౦డ్ల: మొదటి ముద్రణ: 2000: కర్పూరవసంత రాయలు కథా కళా ఝంకృతులు: ప్రచురణ మనస్వినీ దేవి, హైదరాబాదు.

ఆచార్యనారాయణ రెడ్డి, సింగిరెడ్డి: 8 వ ముద్రణ 2021: కర్పూర వసంత రాయలు: వరేణ్య క్రియేషన్స్, హైదరాబాదు

ఎఱ్ఱన: 1924:  నృసింహ పురాణము,  వావిళ్ల రామ శాస్త్రులు అండ్ సన్స్, చెన్నపురి

జానకీ రాం, ఆచంట: కర్పూర వసంత రాయల కావ్య పరిచయం:

డా. వెంకట రామకృష్ణ శాస్త్రి, రెమిల్ల: 2020: నృసింహ పురాణము, టీకా తాత్పర్యాలు: రాఘవేంద్ర పబ్లిషర్స్, విజయవాడ.

(ఔచిత్యం- అంతర్జాల  పత్రికలో ముద్రితం: AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023: ISSN: 2583-4797

link: https://www.auchithyam.com/advanced/latest/march23_05.php)

 

 

 

No comments: