Friday, June 16, 2017

శేషేంద్ర పద్య కావ్యం సొరాబు


శేషేంద్ర పద్య కావ్యం సొరాబు లోంచి ఒక పద్యం మచ్చుకు- 
                                                                          
*క్షోణీ చక్రము ఘూర్ణిలంగ నతడక్షు ద్రార్భటీ సైన్యుడై
నానా సంగర రంగముల్ దిరుగు చుండ న్నొక్కచో శారికా
వాణిం, జారు కళా విలాస నళినీ పాణిన్, మహాబంధుర
శ్రోణిం, భావజు రాణి, బోని విలస ద్రోలంబు వేణిం గనెన్.                                 4
అన్వయం:- క్షోణీ చక్రము ఘూర్ణిలంగ-అతడు భూమి సంచలించు చుండగా, అక్షుద్ర ఆర్భటీ సైన్యుడు- అనల్పమైన పరాక్రమము కల సైన్యంతో కూడినవాడై, నానా సంగర రంగముల్- చాలా యుద్ధభూములను తిరుగుచుండగా, ఒక్కచోట గోరువంకల ధ్వనిలాంటి(శారికావాణిన్) మధురమైన పలుకులు కలిగిన దానిని, చారు కళా విలాస నళినీ పాణిన్- అందమైన కళా విలాసాలు కల పద్మాల్లాంటి చేతులను కల్గినదానిని; మహాబంధుర శ్రోణిన్- విశాలమైన పిరుదులు కలదానిని; భావజు రాణిన్ + పోని- మన్మథుని భార్య రతీదేవికి తీసిపోని దానిని; విలసత్+రోలంబు వేణిన్- నల్లని కాంతితో విలసిల్లే తుమ్మెదల సమూహం లాంటి జడను కలిగిన దానిని; కనెన్- చూచెను.
భావం:- చాలా ఎక్కువ సైన్యంతో చాలా  ప్రాంతాలలో యుద్ధాలు చేస్తూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్నప్పుడు ఒక అందమైన అమ్మాయిని చూశాడు.
వ్యాఖ్య:- అంత్యాను ప్రాసాలంకారంతో ప్రబంధ శైలిని జ్ఞప్తికి తెచ్చే రచనా విన్యాసం ఇక్కడ మనం చూడొచ్చు... వాణిన్- పాణిన్- శ్రోణిన్- వేణిన్. 
“కడుహెచ్చు కొప్పు దానిన్ /గడవన్ జనుదోయి హెచ్చు, కటి యన్నిటికిన్
కడుహెచ్చు, హెచ్చు లన్నియు/నడుమే పసలేదుగాని నారీమణికిన్!”(విజయ విలాసంలోని 1-104) అనే పద్యాన్ని స్ఫురించేలా ఉంది. ఇందులో ఉండే హెచ్చులు చూపును మళ్ళింపలేకుండా ఉండేలా చేయడం గమనించదగింది. మన్మథుడు అందగాడు, అతని భార్యా అందగత్తే, భర్తకోసం ఏదైనా చేయగల అందగత్తే అని సూచన. శివుడు భస్మం చేస్తే తనకు కనబడేలా వరాన్ని పొందింది. జడ తుమ్మెదల బారులా ఉంది అనడం కవిసమయం. అయితే అది తేనె టీగలు లాంటివి. వాటిలో పోల్చడం ఆపై సమూహం అనడం ఆమె స్వచ్ఛమైన ఆరోగ్య తత్త్వాన్ని సుస్థిర పరుస్తున్నాయి. ఇలా వర్ణన చేస్తూ స్త్రీకి సహజ అలంకారాలను అంతే సహజంగా చెప్పడం ద్వారా ఏదో జరగబోతున్నది అని సూచించడం పాఠకుడికి ఉత్కంఠను  రేపుతున్నది.

క్షోణీ తలంబు నెన్నుదురు సోకగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికి జంచరీక చయ సుందర వేణికి రక్షి తానత(తామర)
శ్రేణికి దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామా శుక వారిజ పుస్తక రమ్యపాణికిన్(శ్రీ మహాభాగవతము, ప్రథమ స్కంధము, 6 పద్యం) వాణీస్తుతిని, “అవనీ చక్రము సంచలింపఁగ, దివం బల్లాడ, నాశాచయం
బవధూతంబుగ గోత్రశైల నికరం బాకంపముం బొంద,
ర్ణవముల్ ఘూర్జన మొందఁ గ్రోధము గృతార్ధత్వంబు నొందించి, చి
త్రవధ ప్రౌఢి వహించి సూతునకు రౌద్రంబేర్పడం జూపుదున్ ! (– విరాట పర్వం, భారతము) లో కీచకుడి స్థితిని సూచిస్తున్నది. కోపతీవ్రత మానసిక దౌర్బల్యానికి కారణాలు.
{‘‘భూమండలం కంపించే విధంగా, ఆకాశం అల్లల్లాడి పోయే లాగా, దిక్కులు పిక్కటిల్లేలా, కుల పర్వతాలు వణికి పోయే తెరగున, సముద్రాలు కల్లోలమై పోయేటట్లు, నా క్రోధం సఫల మయచ్యే విధంగా చిత్రవధ చేసే నా నేర్పుని చూపిస్తూ ఆ కీచకుడిని అంతం చేస్తాను!’’ అనుసరిస్తున్నట్లుగా అనిపిస్తున్నది}

                                                        -డా. జాడ సీతాపతిరావు,

భాగవతంలో కొన్ని పద్యాలను నేర్చుకోడానికి –





కలడందురు దీనుల యెడ
కలడందురు భక్త యోగి గణముల పాలం
గలడందురన్ని దిశలను
కలడు కలండనెడు వాడు కలడో లేడో !!

లోకంబులు లోకేశులు
లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం
జీకటి కవ్వల నెవ్వడు
ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!

ఎవ్వని చేఁ జనించు జగ? మెవ్వని లోపల నుండు లీనమై?
ఎవ్వని యందు డిందు? పరమేశ్వరుడెవ్వడు? మూల కారణం
బెవ్వ? డనాది మధ్య లయుడెవ్వడు? సర్వము తానె యైన వా
డెవ్వడు? వాని నాత్మ భవు నీశ్వరు నే శరణంబు వేడెదన్ !!
ఈ విశ్వమంతయూ ఎవ్వనిచే జనింపబడినదో, ఎవ్వనియందింతయు పుట్టి పెరిగి నశించుచుండునో, ఎవ్వనియందు ఈ జగమంతయు అణిగియుండునో, ఈ సకల చరాచర జీవరాశికంతకూ ప్రభువెవ్వడో, దీని మూలకారకుడెవ్వడో, దీనికంతటికిని మొదలు మధ్య చివరలు లేనివాడెవ్వడో, ఈ విశాల విశ్వమంతటికి సమస్తమైన వాడెవ్వడో, సర్వాత్మ స్వరూపుడైనవాడెవ్వడో, అట్టి ఈశ్వరుణ్ణి నా ఆపదను తొలగింపుమని వేడుచున్నాను.

లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నింపం దగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా !!

అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!

సిరికిం జెప్పడు శంఖ చక్ర యుగముం చేదోయి సంధింప డే
పరివారంబును జీర డభ్రగపతిన్ మన్నింపడా కర్ణికాం
తర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచో
పరి చేలాంచలమైన వీడడు గజప్రాణా వనోత్సాహి యై !!

అడిగెద నని కడు వడి జను
అడిగిన తన మగుడ నుడువడని నెడయుడుగున్
వెడ వెడ జిడి ముడి తడ బడ
నడుగిడు నడిగిడదు జడిమ నడుగిడు నెడలన్ !!

Monday, April 10, 2017

సాంకేతిక కాలుష్యంతో... స్వాగతం!

-డా. జె. సీతాపతిరావు, తెలుగు ఉపన్యాసకులు,
                                                 రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు,
చరవాణి:9951171299
(ఉగాది సందర్భంగా నూజివీడు స్థాయిలో ఉత్తమ కవితగా ఎంపికై నగదు బహుమతి పొందింది)
మావి చిగుర్లను వదలి, జియో బాట పట్టిన కుర్ర కోకిల!
పుస్తకాన్ని మస్తకంలో నుంచి ముఖ పుస్తకాన్ని(ఫేస్ బుక్) హత్తుకుంటూ...
మూడు లైకులూ(likes) ఆరు వాట్సప్లూ,  ఫోర్ జీ లు, టాబ్స్ లా మారిన మెదడు

ఇంటర్నెట్ ఉంటేనే ఇల్లు, వైఫై (Wi-fi) ఉంటేనే వైఫ్(wife)
భుక్తి కన్నా ఫేస్ బుక్ లే మిన్న
ఏం చెప్పను?....  చరవాణులు(మొబైల్స్), ఉత్తరాలను మాడ్చేస్తే
జియోలు , ఫోర్ జీ లు మనుషుల్ని మర మనుషుల్ని చేసేస్తున్నాయ్
కాలంతో కదల లేక, బ్రతుకు బండిని ఈడ్చలేక
మోజుల వలలో పావులై, ఉద్యోగాలు ఎప్పుడు తీసేస్తారో తెలియక
బిక్కు బిక్కు మంటున్న... బరువైన జీవితాలు...

నవతా భవితా ఆశాలత ఆకాశంపై ఆరబోస్తున్న అందాల వనిత
భువికి దిగమన్నా.... దిగిరాని దేవులపల్లి భావకవిత
‘విలువ’లు సరసాలుగా మారి.... ఏటో వలస పోయిన ఘనత

కంఠస్థం రాదు, కాన్సెప్ట్ అర్థం కాదు
వీడియోలు, ఆడియోల మోత... మెదడు మాత్రం శూన్యం
తత్త్వ వేత్తలు చెప్పిన శూన్యం ఇదేనేమో?
యూ ట్యూబ్, యూ పోరన్, ట్రిబుల్ ఎక్స్.... సంస్కారం...
ఉస్సురనే సాగే పెద్దల నిట్టూర్పు...
మరలని కుర్రకారు‘లో’చూపు

ఊరగాయీ లేదూ ఊసుబోని మనిషి లేడు
యంత్రమే మంత్రమై, మనుషుల సంబంధం బంధమై
ప్రేమలు చాటు(chat) లై , మాటలు మౌనాలై
దినాలు గడుస్తున్న జగాన, టెక్ ల హైటెక్కుల మోసాలై
సాంకేతిక కాలుష్య కోరల మధ్య... హె హేవలంబి!
విలంబించక మానవత్వం కల మనిషినివ్వు!
జాతిఖ్యాతిని విఖ్యాతమై వెదజల్లే భవిత నివ్వు!
ప్లాస్టిక్ పువ్వులు, తోరణాలతో నిత్య నూతనంగా ఇదే స్వాగతం....!