Friday, June 24, 2011

మనుచరిత్ర - శైలీ పరిశీలన

మనుచరిత్ర - శైలీ పరిశీలన

-డా.జె.సీతాపతి రావు


శైలీ శాస్త్ర అధ్యయనం అంటే సాహిత్య రచనలను భాషాశాస్త్ర అనువర్తన(application)తో అనుశీలించడమే. శైలీ విషయాన్ని పరిశీలిస్తే మనం మామూలు మాటల్లో ఎవడి శైలి వాడిది అని అంటూ ఉంటాం. అయితే ఈ శైలీ విధానం సాహిత్యాన్ని, కవి రచనా దృష్టికి కూడా మరింత మెరుగులు, వన్నెలు అద్దేదిగా ఉండాలి. గురువులు, విశ్రాంత ఆచార్యులు పరిమి రామనరసింహంగారు సూచించిన కొన్ని అంశాలను తీసుకొని ఈ వ్యాసాన్ని తయారుచేయడానికి పూనుకున్నాను.

ఒక కవిత్వాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని పరిమితులు విధించుకోవాలి. అందుకనే ఈ వ్యాసంలో కేవలం అల్లసాని వారి కవిత్వ శైలీ అంశాలను మాత్రమే వింగడిస్తాను. ఛందో వాక్య విన్యాసాలు, పద్య నిర్మాణం, అల్లసాని అల్లిక జిగిబిగి, భాషాప్రయోగాలను అందులోని భాగాలుగా తీసుకొని విశ్లేషిస్తాను.

అట జని కాంచె భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్ఝరీ

పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన

స్ఫుట నట నానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్

గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్ (2 -3)

ఈ పద్యం ఛందోపరంగా చంపకమాల అంటే చంపక పుష్పాల దండ. ఇందులో సహజమైన పుష్పాలతో పాటు కొంత కల్పన కూడా ఉంది. ఇది పూలను గుచ్చిన దారంలా అంతర్గతంగా నిక్షిప్తమై ఉంది. గున్న ఏనుగు విదిల్చిన పూలు చంపక పూలను మరపింపజేయడం అని భావించుకోవాలి. ఇది ఛందోనుభూతికి ఒక తార్కాణం.

అంబర చుంబి అనే పదం రానున్న కథకు కొంత ఉత్కంఠకు తెరతీస్తోంది. చుంబనం వరూధినికి ప్రవరుడు చేస్తాడా? అవును అని సమాధాన సూచన. అయితే మాయా ప్రవరుడని కథలోకి వెళ్తే గాని అసలు విషయం తెలియదు.

శిరస్ , చుంబి అనే పదాలు వాత్సల్యంతో ముద్దుపెట్టుకుంటున్న ఒక సోదరీ సంబంధాన్ని(భూమి, ఆకాశ గంగ) లేక హిమవంతుడు ,గంగ (తండ్రీ, కూతుర్ల అనుబంధం), నాయికా,నాయక (వరూధినీ ప్రవరుల) సంబంధాన్ని గానీ వ్యక్తం చేస్తోంది. అది చూసే వారి అభిరుచిని అనుసరించి ఉంటుంది.

భూమిసురుడు అనే పదంలో ఆ ప్రదేశం సుర భూమి(నరనారాయణులు నడికిన భూమి) ఇతడు కూడా అంతటివాడే. ఈ విషయాన్ని తర్వాత వరూధినిచే కవి చెప్పిస్తాడు.పైగా అక్కడ ఉండే అందానికి మరింత అందాన్ని ఇచ్చింది ప్రవరుడి అందం, వరూధిని అందం. ఈ మూడు అందాలను బిందు పూర్వక గ కారంతో కవి సూచించాడు (అభంగ,తరంగ, మృదంగ). అభంగానికి ప్రకృతి, తరంగానికి వరూధిని(ఆమె ఆపలేని మోహం), మృదంగానికి ప్రవరుడు(ఒక ప్రక్క సాయం సంధ్య మరో ప్రక్క వరూధిని) చిహ్నాలు.

స్ఫుట, నట, కటక పదాలు వరూధిని పరంగా అన్వయిస్తే ప్రవరాఖ్యుడు తన భర్త అని స్పష్టంగా అనుకుంది. కాని నాటకమైంది. ఆమె జీవితం కటక ప్రాయమైంది. గాజు బొమ్మైంది. ప్రాసలో ఉన్న ట కారం గాడీ తప్పింది. నటన అయ్యింది. ఇది ఛందో విన్యాసం.

వర్ణనాశైలికి ఒక మణి రాజం ఈ పద్యం.

సాధారణంగా (వ్యాహహారంలో) వాక్యం చెప్పవలసిన విషయాన్ని ఒక ప్రత్యేక మైన ప్రణాళికను అనుసరించి ఉంటుంది. కావ్యంలో కవి చెప్పదలచిన అంశం ఏదో ఒక ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. అది అతడు అనుకున్న ప్రణాళికలో ఒదిగినట్లు పద్యరచన చేస్తాడు. దీన్నే కథన శిల్పమో లేక నిర్మాణశిల్పమో అనవచ్చు.

ముహుర్ ముహుర్ అనడం దక్షిణ సన్నాయి మేళంలోని ఎడమవైపు పట్టుకునే కర్రతో చేసే ధ్వని. కుడిచేతితో మృదంగాన్ని కొట్టేటప్పుడు వచ్చే లుఠదభంగ తరంగ మృదంగ ధ్వని. ఆ ధ్వనికే నీళ్లు చిమ్ముతున్నాయి. అది వర్షమని నెమళ్లు నాట్యం చేస్తున్నాయి. ఆ నాట్యానికే గున్నఏనుగులు తమ తొండంతో పుష్పాలతో ఉన్న చెట్లను ఊపుతున్నాయి. అవి పూలను రాలుస్తున్నాయి. చెట్లు స్వయంపోషకాలు. అది నాట్యానికి ఇచ్చిన బహుమతిగా అనిపించడం వర్ణణాత్మక శైలి. కర పదం చెట్లు ఒకదానికి ఒకటి తాకడం వల్ల కర్ కర్ అనే శబ్దం వస్తుంది. దాన్నే ఈ పదం తో సూచిస్తున్నాడు. కర కంపిత పదం చెట్టు చెట్టు తగలడం వల్ల వచ్చే ధ్వనికి సంకేతం.

ఒక వాయిద్యం(గులక రాళ్ల ధ్వని - మృదంగం), దానికి నాట్యం(నెమలి), ప్రేక్షకుడు(గున్నఏనుగు) బహుమతి ప్రదాత(చెట్టు పూలను ఇవ్వడం) కవి పాత్రే ప్రవరాఖ్యుడు. ఇలా ఇది కవిత్వ శైలికి మణిహారంగా చెప్పొచ్చు.

అట జని భూమిసురుడు శీతశైలమున్ కాంచె అది వాక్యం. ఇక్కడతో అన్వయం అయిపోయింది. ఈ శీతలశైల వర్ణన ఉంది. దాన్ని మహావాక్యం లేదా దీర్ఘ సమాస యుక్తంగా రచనచేయడం కవికి ఉండే ప్రణాళికలో భాగం. హిమాలయాల సుదీర్ఘత చెప్పదలచుకున్నడు ఈ సందర్భంలో. అందుకే పూర్వభాగంలో అటజని కాంచె అని చెప్పి, శీతశైలాన్ని చూసేటప్పటికి చివరవరకు వాక్యం అయ్యింది. అభంగ తరంగ పదాలు - అభంగ లో మహాప్రాణాక్షరం పర్వతం యొక్క ఎత్తును, తరంగ అల్పప్రాణ అక్షరం పర్వతం యొక్క పల్లాన్ని ధ్వనిరూపంగా సూచిస్తోంది. పూర్వపశ్చిమాలకు వ్యాపించి ఉన్న హిమాలయాలు మహాకవికాళిదాసు శ్లోకాన్ని '' పూర్వాపరౌ వారినిధీ విగాహ్య '' ను తలపింపజేస్తోంది.

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరు వేడెదు భూసురేంద్ర! యే

కాంతమునందున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా

గింతియ కాక నీ వెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ

కింత భయమ్ము లే కడుగ నెల్లిద మైతిమి మాట లేటికిన్

ప్రాస స్థానంలో ఉన్న పదాలను పరిశీస్తే ఇంత - తెరువు; కాంత - జవరాండ్ర; ఇంతి - ఎరుగవే; ఇంత – లేకడుగవే.

ఇంత తెరువు - ఇది చాలా మంచి మార్గం - ప్రవరుడి పరంగా - అతడికి ఎవరో ఉన్నారు సాయం చేస్తారని అనుకున్న మార్గం, వరూధిని పరంగా అందంగా ఉన్నాడు అని, మనసులో (శృంగారానికి)చలనం కలిగింది. ఆ చలనానికి కవి చూపించిన మార్గం కూడా ఇదే.

కాంత - జవరాండ్ర - నేను వయస్సులో ఉన్న స్త్రీని.

ఇంతి ఎరుగవే - స్త్రీ గురించి నీకు తెలియదా?

ఇంత అడుగన్ - ఇంత వరకు వచ్చాక కూడా దాస్తూ ఉంటావా?!

''వంద నలయదు వేవురు వచ్చినేని '' అంటూ ప్రవరుడి భార్య సోమిదమ్మను ప్రథమాశ్వాసంలో వర్ణించాడు కవి. దానికి భిన్నంగా తన ఇష్టం వచ్చినట్లు చేయగల స్వేచ్ఛ, వ్యక్తిత్వం వరూధిని స్వంతం. ఈ అంశాలు ప్రవరుడికి కొత్త. ఈ జవరాండ్ర పదం అప్పటి(అప్పడాలు)ఆలును కాదు. వయస్సులో ఉన్న వడి(యా)ఆలును అని స్ఫురింపజేస్తోంది. ఇంతకు ముందు చెప్పిన అంశానికి వేగవంతమైన(update) విషయం ఇది. ఇది జవరాండ్ర పదానికి ఉండే జవసత్త్వంగా భావించాలి. ఇది ప్రాస పదాలతో ఉన్న ఛందో విశేషం.

''మాట లేటికిన్ '' అనడంలో మాటలతో పనే లేదు, ఎప్పుడో నీ వశమైపోయాను. నువ్వు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే తర్వాత మాయాప్రవరుడికి (గంధర్వుడికి) సులువుగా వరూధుని వశమైంది అనే సూచన ఈ సందర్భంలో గమనింపవచ్చు. 'మును వచ్చిన త్రోవ ' అనడంలో మునులు సైతం ఈ త్రోవలోనే వస్తారు. అదే స్వర్గం. అని సూచ్యం.

తండ్రీ! నాకు ననుగ్రహింప గదె వైద్యంబంచు బ్రార్థించినన్

గండ్రల్ గా నటు లాడి ధికృతుల బోకాల్మంటి వోహో మదిన్

దీండ్రల్ గల్గినవారి కే కరిణి నేనిన్ విద్య రాకుండునే

గుండ్రాడాచిన్ బెండ్లి యేమిటికి జిక్కుంగష్ట ముష్టింపచా

ఈ పద్యంలో "గానటులాడ" అని విభాగం చేసుకున్నప్పటికి "నటులాడ" అని చెప్పుకున్నట్లయితే నటులాడ అనే పదం భావి కవితా అంశాన్ని సూచించడం గమనించదగిన అంశం. తర్వాత చెప్పబోయో అనినం కన్నులు జేవురింప నధరం ... అంటూ సుధీర్ఘ కోపఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు నాట్యఫక్కిలో పాఠకులకు సైతం భయాన్ని కలిగింప చేయడం గమనింపవచ్చు. ధికృతుల్ పదం ధిక్కారచేష్టకు పరాకాష్టగా విశ్లేషిస్తుంది.

ప్రార్థించడం అనుగ్రహించడం తర్వాత సమయంలో కూడా జరుగుతాయి. పద్యక్రమంలో ముందు అనుగ్రహించడం, తర్వాత ప్రార్థించడం ఉన్నప్పటికీ వాటిని బ్రహ్మమిత్రుడు శపించిన తర్వాత ప్రార్థన చేయడం అతడు అనుగ్రహించడం గా మనం అనువర్తించవచ్చు. ఇది పద్య అన్వయక్రమంలో ఒక జిగి.

కరిణి యేనిన్ అనే పదం ఏనుగు ఉండే మదాన్ని (యేన్ , నాకు )ఇందీ వరాక్షుడి గర్వాన్ని, అహంకారాన్ని సూచిస్తోంది. ఇది పద వైచిత్రి. ఆడ ఏనుగుతో పొల్చడం వల్ల ఆ కోపం, గర్వం ఎంతో సేపు ఉండదని సూచన.

పెండ్లి పదం ఇందీవరాక్షుడి కుమార్తె పెళ్లిని పరోక్ష సూచనగా భావించవచ్చు. ఆ వివాహం స్వరోచితో జరుగుతుంది. మహానుభావుల మాటలను అనుసరించి ప్రకృతి సైతం మారిపోతుంది అని అందుకే వీరిద్దరికి, అడవిలో కలుపుతుంది. ఇది మరో గమ్మత్తు. ఇలా మనుచరిత్ర లోని చాలా అంశాలను గమనించవచ్చు.