విభిన్న తరహాలో తెలుగును పరిచయం చేసిన విశ్వవిద్యాలయం రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో 6సం.ల బి.టెక్., Integrate course గా గురుకుల (residential) విద్యావిధానం ఉంది. మొదటి రెండు సంవత్సరాలు యం.బై.పి.సి.,(మాథ్స్, బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రి) చదివే విద్యార్థులకు రెండవ భాషగా తెలుగును అభ్యసిస్తారు. తెలుగును బోధించేతీరు, దాని స్థితిగతులును విశ్లేషించడం ఈ వ్యాసోద్దేశం.
ఈ విశ్వవిద్యాలయంలో మరో ప్రత్యేకత లెర్నింగ్ బై డూయింగ్ విద్యా విధానం. ఈ తరహా విద్యా విధానంలో ఆ పాఠానికి సంబంధించిన నిపుణులతో వీడియోలద్వారా బోధన ఉంటుంది. అందమైన కుర్చీలతో లాప్ టాప్ ల సహకారంతో అన్ లైన్ ద్వారా, సంబంధిత అంశాల మీద సందేహాలను మెంటర్స్/లెక్చరర్స్ సహకారంతో తీర్చుకోవచ్చు. డౌన్ లోడ్ కూడా చేసుకునే వీలు ఉంది. ఇది తరగతికి సంబంధించిన విధానం. ఈ విశ్వవిద్యాలయంలో మరో ప్రత్యేకత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిగ్రీతో పాటు, ఇంజనీరింగుకు సంబంధించిన మరో డిగ్రీకూడా లభిస్తుంది.
తెలుగు సంస్కృతి, అనుభవ పాఠాలను నీతుల రూపంలో రంగరించిన సంకలంతో వచ్చిన పాఠ్యపుస్తకం "తెలుగు జాతి వివేకం". మాతృ భాష మీద మమకారం, తెలుగు భాషమీద అభిమానం, ముచ్చట గొలిపే చిన్ని చిన్ని తేట గీతులు, అందమైన ఆటవెలదులు, అచ్చమైన కందాలు, ఉత్పల, చంపకమాలలతో అలరారే అద్భుత ఆలోచనల సమాహారం ఈ పుస్తకం. మూడు చిన్న వాక్యాల్లో చెప్పాలంటే - తెలుగు జాతికి ప్రతిరూపం. తెలుగు భాషకు మణిహారం. తెలుగు తల్లికి తలమాణికం.
పద్యభాగ విషయంలో భర్తృ హరి సంస్కృతంలో సుభాషిత రత్నావళి రాసారు. దాని ప్రాతిపదికగా, ఇందులో 14 పద్ధతుల్లో విభాగాలు చేసారు.
మొదటి పద్ధతి ధర్మ పద్ధతి.
"ధర్మో రక్షతి రక్షిత:" ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత విద్యార్థి దశనుంచి అవసరం. ధర్మం అనే పదం ఇంగ్లీషువారుసైతం మనదేశంనుంచి వారి భాషలోకి అదే పదంగా తీసుకున్నారు. భూమిమీద ఏదైతే మనిషిని మనిషిగా నిలుపుతుందో అదే ధర్మం. మానవ ఐక్యత , విశ్వమానవశ్రేయస్సు దాని లక్ష్యం. ఇది ఏ మతానికి సంబంధించినది కాదు. సనాతనమైంది. దీనికి సంబంధించి 14 అంశాలతో పద్యాలున్నాయి. అందులో కొన్ని -
1. కోపాన్ని జయించాలనడం. 2.కోపాన్ని జయించినట్లయితే కోర్కెలు తీరతాయి అని చెప్పడం. 3.శత్రుత్వాన్ని మంచితనంతో జయించాలి. 4.చేతులకు దానం; నీతిగా బ్రతకడం; స్త్రీకి మానాన్ని కాపాడుకోవడం అభరణాలు. 5. ఒరుల మనసుని నొప్పించకుండా ఉండడం సంస్కారం. 6. సమస్త ప్రాణుల్ని తమలా చూడడం. 7. చెట్లను ఆదర్శంగా తీసుకొని, వాటిని సంరక్షించడం. 8. ముసలి తలిదండ్రులను ప్రేమించడం.
ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలిపేది నీతి పద్ధతి.
అసందర్భంగా నవ్వడం ఆపదలు కోరి తెచ్చుకోవడం లాంటిది. పరోపకారాన్ని కలిగి ఉండాలి. నిజాన్ని మాట్లాడడం, కోటకు మంచి భటుడు, చీటికి చేవ్రాలు ప్రాణ ప్రదమైనవి. బాహు బలం కంటే బుద్ధి బలం గొప్పది. దాన్ని కూడా అలవర్చుకోవాలి. ఎవరు చెప్పినా విని, యుక్తాయుక్త విచక్షణ కలిగి నీతి పరుడిగా ఎదగాలి. అతిథిని దేవుడిగా భావించాలి. వ్యసనాలకు దూరంగా ఉండాలి. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరం. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి. అవినీతి సంపాదన మంచిది కాదు, నేరం కూడా అంటూ నీతి పద్ధతులు వివరించారు.
వివేక పద్ధతిలో ప్రయోజనకరమైన పనిని చేయడం వివేకం. " ప్రయోజన హీనోపి మందో పి నప్రవర్తతే '' అనే నీతిని వ్యక్తం చేస్తోంది. అందుకే అభ్యాసం ప్రయోజలేని విద్య, తిండికి జరగని ఉద్యోగం ప్రయోజనాన్ని ఇవ్వవు. అలాగే రహస్యమైన విషయాలు ఎవరివి వారి దగ్గరే ఉంచుకోవాలి. తెలివైనవాడు కొత్త, పాతల మేలుకలయికతో ముందుకు వెళ్తాడు. విద్యవలన పరమ ప్రయోజనం వినయం. దాని ద్వారా చివరకు ఐహిక ఆముష్మిక సుఖాలను పొందడం జరుగుతుంది. దానికి స్వయం కృషి చాలా అవసరం.
నిరంతర కార్యసాధన అవసరం. ప్రజ్ఞావంతులు పనిని సాధించడంలో వచ్చిన కష్టాలను తలచుకొని దాన్ని వదలివేయరు. కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలి. అట్టివాడే స్థితప్రజ్ఞుడు అని తెలుసుకోవాలి. ధర్మం చిన్నవాడు చెప్పినా విని, ఆచరించాలి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే పల్లెలనుంచి వచ్చిన విద్యార్థులు తమ మాట తీరును మెరుగుపరుచుకోవాలి. దీనికి సంబంధించిన పద్యాలు మచ్చుకు కొన్ని -
1.వాక్కులే నిజమైన భూషణాలు అని చెప్పే భర్తృహరి పద్యం.
2.ఆ వాక్కువల్ల ప్రయోజననాన్ని చెప్పే పద్యం –
"మాటల చేత భూపతులు మన్నన చేసి, పురంబులిత్తు, రా
మాటల చేత దేవతలు మన్ననచేసి, వరంబులిత్తు, రా
మాటల చేత మానినులు మన్నన చేసి, సుఖంబులిత్తు, రా
మాటలు నేర్వకున్న, అవమానము, న్యూనము, మానభంగమున్".
3. ప్రియంగా మాట్లాడడంవల్ల లోకానికి ప్రియులౌతామని చెప్పే పద్యం.(30) ప్రియంగా మాట్లాడడం మంచిదే కదా అని అసత్యాన్ని చెప్పకూడదని చెప్పే పద్యం (17) కూడా ఉంది. ఆ మాట్లాడడంలో మర్మాలను తెలుసుకోవాలి అని చెప్పే పద్యం (48).
మంచివాడు అంటే ఎవడు? అని ప్రత్యక్షంగా చెప్పడం ఒక పద్ధతి. మూర్ఖుడి లక్షణాలు చెప్పి, అవి కాని వాడు మంచివాడు అని చెప్పడం మరో పద్ధతి. మూర్ఖులు సహజంగా పుట్టుకతో వచ్చిన వారు కొందరు, అజ్ఞానంతో మూర్ఖులు మరో రకం. గర్వంతో మూర్ఖత్వం పొందడం మరో అంశం. ఆయా స్వభావాలనుబట్టి గుర్తించి, దూరంగా ఉండాలి. ఈ అంశాలకు సంబంధించి ఉదాహరణలు ఇచ్చారు. గాడిద గంధపు చెక్కలు ఎన్నిసార్లు మోసినా దాని పరిమళాన్ని గ్రహించలేదు. అలాగే హీనబుద్ధుడు కూడా ఘనుడు కాలేడు.(87) అయితే ఇక్కడ విద్యార్థికి కావలసింది ఓర్పు, వినయం, తెలుసుకోవాలనే కోరిక, లక్ష్య సాధన దిశగా ప్రయత్నం ఆవసరం. వ్యక్తిలోని వ్యక్తిత్వాన్ని, పాండిత్యాన్ని బట్టి గౌరవం వస్తుందని వివరించే పద్యం 81 వది.
దుర్జనుడికి, మూర్ఖుడికి తేడా ఏంటి? మూర్ఖుడు వెంటనే బయటపడిపోతాడు. దుర్జనుడు మనస్సులో దాచుకుంటూ అప్పుడప్పుడు దాన్ని ప్రయోగిస్తుంటాడు. వాడిని కనుక్కోవడం కష్టం. అయినా ''కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?'' అంటూ విశ్లేషించారు. కంచు, కనకం మోత అనే ఒక ఉదాహరణతో వివరించే ప్రయత్నంతో చేసారు(91). నిరాడంబరతకూడా సజ్జనుడి గుణం. విద్యార్థి ఉన్నత స్థానాన్ని పొందాలి. అక్కడతో పని పూర్తవలేదు. అప్పుడే మొదలైందని భావించాలి. ఎలాగంటే - దానికి భర్తృహరి సుభాషితాన్ని ఉదాహరణగా చెప్పారు - ఆకాశంబు నుండి శంభుని శిరం నుండి పతనం అయిన గంగ సముద్రంలోనే కలిసింది. కానీ శివుని శిరస్సును పొందలేకపోయింది. అలాగే ఉన్నత స్థానాన్ని పొందినవాడు దాన్ని నిలుపుకొనే ప్రయత్నం ఎల్లప్పుడూ చేయాలి. అంటే బద్ధకం వీడాలి అని తెలుసుకోవాలి.
అల్పబుద్ధివాడు తెలివైన వాడిని అల్లరపాలు చేయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. క్షీర సాగరంలో కాకి రెట్ట వేసినంత మాత్రాన సముద్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలివైనవాడు వెంటనే దాన్ని గమనించి వాడి పట్ల జగరూకతతో ఉంటూ దూరంగా ఉండాలి. తెలివైన వాడు మందితో తగాదా పెట్టుకోడు. ఒక్క మాటలో చెప్పలంటే
'అకారణంగా పరులను హింసించేవాడు దుర్జనుడు '.
దుర్జనులను, సజ్జనులను ఎలా గుర్తించాలి? అంటే ఉప్పు, కర్పూరంలా ఉంటారు. వారి గుణాలను, చేసిన పనుల ఆధారంగా తెలుసుకోవాలి. నిత్యం నిజాన్నే మాట్లాడాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత ఏర్పడుతుంది. ఆపదల్లో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు. ధనం ఉన్నప్పుడు కప్పల్లా వచ్చేవారే బంధువులు.(137)
ఇతరులమనసుకు నొప్పికలగకుండా, ఏ సమయంలో ఏది మాట్లాడాలో అలవరచుకోవాలి(136). స్త్రీల విషయంలో - ఆమెకు బాధ పెట్టకూడదు. అలా బాధ పెట్టకపోతే సిరిఉంటుంది. లేదంటే అది పోతుంది. విద్యార్థి ప్రశ్నించడం ద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అంటే తరగతి గదిలో శ్రద్ధగా పాఠ్యాంశాలను విన్నవాడే ప్రశ్నలు వేయగలడు. ఇది విద్యార్థి లక్షణాల్లో ఒకటి. ప్రశ్నలు వేయమన్నామని అసందర్భపు ప్రశ్నలు కూడా వేస్తారు కొందరు. అవి కావాలని వేస్తే, వారికి కాలం వృధా చేయడం అంటే ఇష్ట పడుతున్నారని వేరే చెప్పక్కర్లేదు.
మాటలవల్ల స్నేహ సంబంధాలు వర్థిల్లుతాయి(186). ధనాన్ని సంపాదించాలి. దాన్ని అనుభవించాలి. లేదా దానం చేయడం దాని ప్రయోజనాలు. అలా కాక లోభత్వం కలిగి ఉన్నట్లయితే అది అశాంతిని కలిగిస్తుంది(199) అని గ్రహించాలి. మొత్తం మీద వేమన శతకంనుంచి 72 పద్యాలు, సుమతి శతకం నుంచి 29 పద్యాలు, భర్తృహరి సుభాషితాలనుంచి (అనువాదంగా వచ్చిన) 19 పద్యాలు, భాస్కర శతకం నుంచి10 పద్యాలు, ఆంధ్రమహాభారతం నుంచి 13పద్యాలు ఇలా ప్రాచీన కవిత్వానికి చెందినవిగా నూరు పద్యాలు; మిగిలినవి ఉండేల మాల కొండారెడ్డి రచించిన మానవగీత, జీవన గీతాలు, సత్యం శివం సుందరం నుంచి 34పద్యాలు; మల్లెమాల, దాశరథి మొదలగు వారి రచనల నుంచి నూరు పద్యాలు ఇచ్చారు. దీనివల్ల పాత కొత్తల మేలు కలయికగా జీవన సారాన్ని తెలుసుకోవాలి.
గద్య భాగానికి వస్తే నీతిచంద్రికలోని గ్రాంధిక భాషలో ఉన్నసూక్తుల్ని తీసుకున్నారు. ఈ సూక్తులు పద్యాలలోని చాలా అంశాలనే సూచిస్తూ ఉన్నప్పటికీ, అనువాదానికి అనువుగా ఉన్నాయి. దు:ఖ భాగులు, వారి లక్షణాలు, ప్రయత్న ఫలాలు, సజ్జన సాంగత్యం, చదువుకున్న చదువును జీవితంలోకి అనుప్రయుక్తం (application) చేయమనడం, స్వతంత్రంగా జీవించమనడం, ఆర్తత్రాణ పరాయణత్వాన్ని కలిగి ఉండడం ముఖ్యమైనవి.
ఆంధ్రదేశ ప్రాచీనత, భాషావిషయకమైన అంశాలు, పాలనా పరమైన అంశాలను పరిచయం చేసారు. చదువు కథలు అనే కథల సంపుటి నుండి దాశరథి రంగాచార్య రచించిన చదువు కథానిక ఈ పుస్తకంలో ఉంది. పేదవాడు చదువుకోవాలనే కోరిక, వాడుపడే కష్టం కళ్లల్లో నీటిని నింపుతుంది. కాలాన్ని వృధా చేయకుండా, గతంలో ఉన్నపేదరికాన్ని మరచి పోకుండా, ప్రభుత్వ సహకారాన్ని తీసుకుంటూ విద్యార్థి జీవితాన్ని కొనసాగించాలి. పట్నంలో ఉన్నా పల్లెను మరచిపోకూడదు. చదువుపట్ల పట్టుదల కలిగి ఉన్నట్లయితే ప్రయత్నంతో కార్యసిద్ధిని పొందవచ్చుఅని నిరూపించిందీ కథానిక.
దీనిలో పద్యాలలోచదవడం వల్ల, నేర్చుకోవడం వల్ల విద్యార్థుల్లో ధారణా శక్తి పెరుగుతుంది. ఈ పద్యాలకు నీతి కథలు జోడించి చెప్పడం వల్ల తెలుగు తరగతి అంటే ఇష్టంతో పాటు, అంతవరకు నేర్చుకుంటున్న బోధనాంశాలనుండి ప్రశాంత చిత్తులవుతారు. తెలుగు భాషను, అందులోని ఆనందాన్ని గ్రహించడానికి వీలుకలుగుతుంది. మనోవికాశానికి కూడా దారి తీస్తుంది.
మొత్తం 200 పద్యాలు పద్యభాగంలోను; 25 నీతిసూక్తులు, ఆంధ్రం – తెలుగు నాడు నేడు, మాండలికాల(dialect) పరిచయం, చదువు కథానిక, చదువుకోసం చేసే ప్రయత్నం గద్య భాగంలోను; వ్యాకరణ విభాగంలో ఛందస్సు, పద్య భేదాలు - లక్షణాలు, అలంకారాలతో ఈ పుస్తకం, మొదటి సంవత్సర కాలం ముగిసిపోతాయి.
ఈ పుస్తక సంకలన కర్త - డా. ఉండేల మాల కొండారెడ్డి, పరిష్కర్త - వాచస్పతి, డా. కె. కుసుమా రెడ్డి. మొదటి ముద్రణ 2009, ద్వితీయ ముద్రణ 2010. వెల 50రూపాయలు మాత్రమే. ఈ పుస్తకం కొనాలనుకుంటే లభ్యమయ్యే స్థలం - రిజిస్ట్రార్, రాజీవ్ ఈ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, మహావీర హాస్పటల్ ఎదురుగా, మాసబ్ టాంక్ , హైదరాబాదు 500 028. విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పక బుధ్ధులు నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ఈ పుస్తకం తప్పక సహకరిస్తుంది.తెలుగు జాతి వివేకంద్వారా మంచితనాన్ని, సేవాదృక్పథాన్ని అలవరచి తెలుగువారి వివేకాన్ని చాటుదాం. ఇదండి తెలుగు జాతి వివేకం.
0 comments:
Post a Comment